ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్కు కారు కావాల్సిందిగా డ్రైవర్ తోపాటు వారు ప్రయాణిస్తున్న కారును పోలీసులు తీసుకెళ్లడంతో ఓ కుటుంబం రోడ్డుపై చిక్కుకుపోయింది.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాస్ శ్రీవారి దర్శనం కోసం తన భార్య పార్వతి, మరో జంట, ఇద్దరు పిల్లలతో ట్రావెల్స్లో కారు బుక్ చేసుకుని బయలుదేరారు. బుధవారం రాత్రి 7 గంటలకు వినుకొండలో బయలుదేరిన వీరు 10 గంటల సమయంలో ఒంగోలు సిటీ చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్ లో టిఫిన్ చేశారు. అంతలో అసిస్టెంట్ ఎంవీఐ సంధ్య, హోంగార్డు అక్కడకు వచ్చి ‘మీ లగేజీ కారు నుంచి దించుకోండి. ఈ వెహికల్ సీఎం కాన్వాయ్ కోసం ఉంచుకుంటున్నాం’’ అని చెప్పి.. కారు తీసుకుని వెళ్లిపోయారు. తాము తిరుపతికి వెళుతున్నామని, ఇలా రోడ్డుపై వదిలేస్తే ఎలా సార్ అని బతిమలాడినా వినలేదు. రాత్రి సమయం కావున వేరే క్యాబ్ బుక్ కాకపోవడంతో ఆ కుటుంబం ఒంగోలు బస్సు స్టాండ్ లోనే ఉండిపోయారు.
ఈ చర్యను విమర్శిస్తూ, ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉపయోగించేందుకు ఆర్టీఏ అధికారులు ప్రజల కారును లాక్కెళ్లడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజలను అరాచక పాలన ఎలా పీడిస్తోందో ఇది బట్టబయలు చేసిందని ఆయనన్నారు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సీఎం జగన్ ఒంగోలు జిల్లాకు చెందిన ఇద్దరు రవాణా శాఖ అధికారులైన హోంగార్డు పి.తిరుపాల్రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.సంధ్యలను సస్పెండ్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)