తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలపడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విపరీతంగా పోరాడి అధికారాన్ని దక్కించుకొంది. అప్పట్లో ఎన్నికల కోసం పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించడం జరిగింది. ఆ తర్వాత నుంచి పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ పాలన మీద దృష్టి సారించే అవకాశం తగ్గిపోయింది.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. వాస్తవానికి గత జనవరిలోనే స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. దీంతో సర్పంచులు ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు , జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కోసం ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పట్లో ఆరు నెలల కాలానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికలు వస్తుండడంతో.. కాంగ్రెస్ నాయకత్వం మీద ఢిల్లీ హైకమాండ్ నుంచి ఒత్తిడి ఏర్పడింది . దీంతో తెలంగాణ పార్టీ నాయకత్వం అంతా పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి సారించింది. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరడంతో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలవుతాయని కిందిస్థాయి క్యాడర్ ఎదురుచూస్తోంది.
కానీ ఇక్కడే అసలు సమస్య ఏర్పడుతోంది . ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నికల హడావుడిలోనే మునిగిపోయింది. దీంతో ప్రభుత్వ వ్యవహారాలు చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు కరెంటు విషయమే చూసుకుంటే … బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసినంతకాలం పెద్దగా విద్యుత్ కోతలు లేవు. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు విస్తారంగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం తరఫున సమీక్షలు లేకపోవడంతోటే విద్యుత్ వ్యవహారాలలో గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. నాలుగైదు సంవత్సరాలుగా చక్కటి విద్యుత్ సరఫరా జరిగిన తెలంగాణలో… ఒక్కసారిగా కరెంటు కోతలు రావడం వెనక కొన్ని మెలికలు కనిపిస్తున్నాయి. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ చక్కదిద్దాలంటే కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పెట్టుకుంటే మరింత ఇబ్బంది ఏర్పడుతుందని నాయకత్వం భావిస్తోంది. అందుచేతనే మరోసారి స్థానిక సంస్థలు ఎన్నికల్ని వాయిదా వేస్తారని తెలుస్తోంది.
నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో జరిగేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీనికి కారణంగా బీసీల రిజర్వేషన్లు చూపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఖరారు కాకుండా, ఎన్నికలు వెళ్లొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుంది.
దీంతో.. జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 23 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో చట్ట సవరణ చేయాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా.
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది. ఇక జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగిస్తే.. వాటికి కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి ముగుస్తుంది. అక్కడ కూడా ప్రత్యేక అధికారులను నియమిస్తారు.
మొత్తానికి వచ్చే ఏడాది జనవరి నుంచి రెండు మూడు నెలల పాటు వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈలోగా పరిపాలన వ్యవహారాలు గాడిని పడటంతో పాటుగా ఎన్నికల హామీల అమలు కూడా రూపొందుకుంటుంది. ఇవన్నీ కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది.