తాజ్ మహల్లో తాళం వేసి ఉన్న గదులను తెరిచి శివాలయం ఉనికిని నిర్ధారించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 22 గదులు మూసి ఉన్నాయని అక్కడ హిందూవిగ్రహాలు, సనాతన హైందవానికి సంబంధించిన గ్రంథాలున్నాయని పిటిషన్ వాదన. అది నిర్థారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్లో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలైంది. అక్కడ పాత శివాలయం ఉందని కొంతమంది చరిత్రకారులు, కొన్ని హిందూ సమూహాల వాదనలను ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
బీజేపీ అయోధ్య యూనిట్ మీడియా ఇంచార్జి రజనీష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ అక్కడున్న శివాలయాన్ని కూల్చివేసి సమాధిగా మార్చారని కొందరు చరిత్రకారుల వాదనలను రిట్ పిటిషన్లో రజనీష్ సింగ్ ఉదహరించారు. తాజ్ మహల్ పాత శివాలయమని అనేక హిందూ సంఘాలు వాదిస్తున్నందున, దానిపై విచారణ జరిపి వివాదానికి స్వస్తి పలకాలని పిటిషన్లో కోరారు.
https://twitter.com/ANINewsUP/status/1523461752608165890?s=20&t=PxiFGV4zbcElTPXCgG6Ppw
లాయర్లు రామ్ ప్రకాష్ శుక్లా, రుద్ర విక్రమ్ సింగ్ ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్లో తాజ్ మహల్ బేస్మెంట్, పై అంతస్తులలో ఇరవైకి పైగా మూసి ఉన్న గదులు ఉన్నాయని.. వాటిని ప్రజలకు చూపించడానికి తెరవడం లేదని సింగ్ వాదించారు. ఆ గదుల్లో హిందూ విగ్రహాలు, గ్రంధాలు ఉన్నాయని.. తాజ్ మహల్ నిజానికి శివాలయం అని అవి రుజువు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మరణానంతరం ఆమె స్మారక చిహ్నంగా శివాలయాన్ని మార్చుకున్నారనే వాదనను నిర్ధారించడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్ ASIని కోరింది. దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా ఏఎస్ఐని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.
“కొన్ని హిందూ సమూహాలు, సాధు సంతులు ఈ స్మారకాన్ని పాత శివాలయంగా పేర్కొంటున్నారు, దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ సమాధిగా మార్చారు అంటున్నారు. కొందరు వ్యక్తులు అత్యుత్తమ శివాలయాలైన జ్యోతిర్లింగాలలో ఒకటిగా తేజో మహాలయ(తాజ్ మహల్)ను నమ్ముతారు” అని పిటిషన్ లో పేర్కొన్నారు.
నాలుగు అంతస్థుల భవనంలో బేస్మెంట్, పై అంతస్తులలో భాగాలలో సుమారు 22 గదులు శాశ్వతంగా తాళం వేసి ఉన్నాయని PN ఓక్ వంటి అనేకమంది చరిత్రకారులు, అలాగే కోట్లాది మంది హిందూ ఆరాధకులు కూడా అది శివాలయమే అని గట్టిగా నమ్ముతున్నారని పిటిషనర్ వాదన.