పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 16న పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది.
బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా ట్విట్టర్ లో ఈ దుర్మార్గాన్ని షేర్ చేశారు. “పాక్లో మైనారిటీలు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఇద్దరు హిందూ టీనేజ్ అక్కాచెల్లల్లపై అత్యాచారం జరిగింది. పాక్ పోలీసులు 3 రోజులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు, ఆ ప్రాంతంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు బాధితుల కుటుంబ సభ్యులతో సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు” అని ట్వీట్ చేశారు.
Minorities continue to suffer in Pak: 2 Hindu teenage sisters raped at gunpoint in Punjab province of Pakistan. Pak Police registered case after 3-day delay as some influential people of the area reportedly wanted to settle the matter with victims' family https://t.co/402pJuMs4E
— Manjinder Singh Sirsa (@mssirsa) June 16, 2022
జూన్ 5న ఉదయం, 16, 17 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరీమణులు, లాహోర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్నగర్, ఫోర్ట్ అబ్బాస్లోని తమ ఇంటి నుంచి సమీపంలోని పొలంలో కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం బయలుదేరారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని తుపాకీతో బెదిరించి పట్టుకున్నారని ఆ ప్రాంత పోలీసులు తెలిపారు. నిందితులను ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ అలీగా గుర్తించారు. నిందితులు వారిపై అత్యాచారం చేసి, అక్కడి నుంచి పారిపోయారని పోలీసు అధికారి తెలిపారు. బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని ఏరియా పోలీసు అధికారి యాకూబ్ తెలిపారు.
పోలీసులు ఈ సంఘటనను వెంటనే పట్టించుకోకుండా.. మూడు రోజుల ఆలస్యంగా కేసు నమోదు చేశారు. నిందితులలో ఒకరైన కాషిఫ్ అలీ పలుకుబడి, ప్రభావమే కేసును నిర్వహించడంలో పోలీసుల నిర్లక్ష్యానికి కారణమని భావిస్తున్నారు. కాషిఫ్ ఈ ప్రాంతంలోని పేరున్న కుటుంబానికి చెందినవాడు కావడంతో అతని కుటుంబం ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులతో ప్రైవేట్గా పరిష్కరించుకోవాలని.. కోర్టు వరకు వెళ్లకుండా చూడటానికి ప్రయత్నించారు. అందుకే నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారు. అయితే మూడు రోజుల తర్వాత బాలికల తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిందితుల్లో ఒకరైన ఉమైర్ అష్ఫాక్ను పోలీసులు అరెస్టు చేయగా, మరొకరు కాషీఫ్ అలీ అతని కనెక్షన్స్ ను ఉపయోగించి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు.