రాష్ట్రంలోని యూజీ, పీజీ కోర్సుల్లో నాన్ లోకల్స్ కు మరిన్ని సీట్లు దక్కనున్నాయి. ఇంటిగ్రేషన్ కోటా కింద ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్న 5 శాతం సీట్లు ఇక నుంచి 20 శాతానికి పెరగనున్నాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన సోమవారం జరిగిన యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
డిగ్రీ కోర్సుల్లోనూ ఫ్రెంచ్ వంటి పలు విదేశీ భాషలు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశం కల్పిస్తారు. వర్సిటీల్లో సీట్లు పొందాలనుకునే అభ్యర్థులను సీపీ గేట్ ద్వారానే ఎంపిక చేస్తారు. వర్సిటీలు నిర్దేశించిన ఫీజులను అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. వరుసగా మూడేళ్లపాటు జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు మూతపడనున్నాయి. జీరో అడ్మిషన్లు ఉన్న కోర్సులు కూడా రద్దు కానున్నాయి. అన్ని యూనివర్సిటీల్లో కామన్ క్యాలెండర్ అమలు కానుంది. ఇలా పలు అంశాలపై అనేక నిర్ణయాలను తీసుకున్నారు.
జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను రాష్ట్రానికి రప్పించడం, వర్సిటీల్లో చదివేలా ప్రోత్సహించడమే ధ్యేయంగా స్థానికేతరులకు 20 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న 15 శాతం సీట్లను సూపర్ న్యూమరరీ కోటా కింద పెంచనున్నారు. సంబంధిత సమాచారం విద్యార్థులకు చేరడానికి ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ను 27 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో కూడా దీనిని ఉంచనున్నారు.