దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదు. అనేక సమస్యల్ని ఎదుర్కోవాలంటే రుణాలు తీసుకోక తప్పడం లేదు… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలివి. తీవ్రమైన వనరుల కొరత కారణంగా ప్రజాసంక్షేమానికి ఖర్చు చేయలేకపోతున్నామని ఇమ్రాన్ అన్నారు. పెరుగుతున్న విదేశీ అప్పులు, తక్కువ పన్నుల రాబడి జాతీయభద్రతకు పెనుముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూ (ఎఫ్ బి ఆర్)… ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ (టిటిఎస్) ప్రారంభోత్సవ వేడుకలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“మా పెద్ద సమస్య ఏమిటంటే, మన దేశాన్ని నడపడానికి తగినంత డబ్బు లేదు, దాని కారణంగా మేము రుణాలు తీసుకోవలసి ఉంటుంది” అని ఖాన్ అన్నారు. పన్నుల వసూళ్లపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పన్నులు చెల్లించని సంస్కృతి వలసరాజ్యాల కాలం నాటిదని కానీ ఇప్పుడు ప్రజలు తమ దగ్గర డబ్బులున్నా పన్నులు చెల్లించడం లేదని విచారం వ్యక్తం చేశారు. స్థానిక వనరులను సమకూర్చుకోవడంలో విఫలమవడంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు.
గత నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం 3.8 బిలియన్ డాలర్ల విలువైన కొత్త విదేశీ రుణాలను పొందిందని ఖాన్ చెప్పారు.
ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గత ఏడాది ఇదే కాలంలో పొందిన రుణాలతో పోలిస్తే 580 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 18శాతం ఎక్కువ. ఇక ఇమ్రాన్ కన్నా ముందటి ప్రభుత్వాలు అంటే…2009 నుంచి 2018 వరకు భారీగా అప్పులు చేశాయి. పన్నులు చెల్లించడం ద్వారా మాత్రమే పాకిస్తాన్ అప్పుల బారినుంచి బయటపడొచ్చన్నది ఇమ్రాన్ సహా నిపుణుల మాట.