ఫిబ్రవరి 5 వచ్చిందంటే కశ్మీర్లో ఒకరకమైన వాతావరణం ఉండేది. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో వాడవాడనా ర్యాలీలు తీసేవారు. కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమకారులైతే రోడ్లమీదకి వచ్చి హల్ చల్ చేసేవారు. ఎటు చూసినా బహిరంగ ఊరేగింపులు, ర్యాలీలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు సాగుతుండేవి. కశ్మీర్ వీధుల్లో ప్రత్యేక కవాతులు సాగుతుండేవి. కానీ ఈసారి లోయలో పూర్తి ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. 370 ఆర్టికల్ ఎత్తివేత వల్లనే ఆ మార్పు.
కాశ్మీరీ వేర్పాటువాద ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు పాకిస్థాన్ ఫిబ్రవరి 5ని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 1990లో నవాజ్ షరీఫ్ ఆదేశ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రకటించారు. నాటి నుంచీ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న భారతవ్యతిరేక గుంపు జమ్ముకశ్మీర్లో హింసను ప్రేరేపిస్తుండేవి. ఇక ఈ రోజునైతే మరీ దారుణమైన పరిస్థితులు కనిపించేవి.
2019 ఆగస్టులో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ పాకిస్తాన్ ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కశ్మీర్ కు మద్దతుగా అంతర్జాతీయ వేదికపై గళమెత్తాలనీ నిర్ణయించింది. కానీ కశ్మీర్ విషయంలో ప్రపంచం ముంగిట ఆదేశం ఏకాకే అయింది. ఇక వారం నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయాల్లో అనేక కార్యక్రమాలు, చర్చా వేదికలూ ఏర్పాటు చేసింది. అయితే ఆ కుటిలయత్నాలు మన కశ్మీర్ లోయలో ఎలాంటి ప్రభావం చూపలేదు. 1990 ల ప్రారంభంలో వేర్పాటువాదం పేట్రేగిన పరిస్థితులకు నేటి పరిస్థితులకు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
గతంలో, హురియత్ కాన్ఫరెన్స్ వేర్పాటువాద స్వరాన్ని వినిపిస్తూ కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని జరిపేది. గతేడాది సెప్టెంబర్లో హురియత్ చీఫ్ సయ్యద్ అలీ గిలానీ మృతితో ఈసారి ఏమూలా ఎలాంటి కార్యక్రమం జరగలేదు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాద శక్తులు పూర్తిగా బలహీనమయ్యాయి. లోయలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సైన్యం, భద్రతా దళాలు కృషి చేస్తుంటే స్థానిక పౌరులూ సహకరిస్తున్నారు.
Youth is the hope of Kashmir's future. We must believe in their unity and strength, Kashmir stands united.#IAmKashmir#KashmirSolidarityDay#Feb5AntiTerrorismDay @adgpi @NorthernComd_IA pic.twitter.com/69QGRh7nEI
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) February 5, 2022