బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి 75 ఏళ్లు దాటిపోయింది. కానీ విదేశీ పాలకులచిహ్నాలు, జ్ఞాపకాలతోనే ఇంకా బతికేస్తూ పోతున్నాము. మన సమాజంలో చాలామందికి విదేశీ మోజు మాత్రం తగ్గటం లేదు. అందుచేతనే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు జ్ఞాపకాలతో నిలిచిపోతున్నాము.
కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు స్వదేశీ జాగరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ముఖ్య నగరాలకు పేర్లు మార్చుకోవడం జరిగింది. ఉదాహరణకు గతంలో మద్రాసు ఉన్న నగరాన్ని చెన్నైగా, బాంబే పేరుతో ఉన్న పట్టణాన్ని ముంబైగా, కలకత్తా పేరుతో ఉన్న నగరాన్ని కోల్కతాగా మార్చుకోవడం జరిగింది. అలాగే అలహాబాద్ని ప్రయాగరాజ్ అని కూడా మార్చుకున్నాము.
ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులలోని పట్టణాల పేర్లను మార్చడం జరుగుతోంది. ఈ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపై పోర్టుబ్లెయిర్ ను శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
దీనికి కారణాలను కూడా అమిత్ షా వివరించారు. స్వాతంత్ర పోరాటంలో అండమాన్ దీవులకు ప్రత్యేక స్థానం వుందని, వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టామని వివరించారు. అండమాన్ దీవుల నుంచే మొదటి సారి నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఈ దీవుల ప్రాంతం ఒకప్పుడు చోళులకు నౌకా స్థావరంగా ఉందనిఉంది వెల్లడించారు. ఇవాళ భారత్ కు వ్యూహాత్మకంగా కీలక స్థావరంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరసావర్కర్, ఇతర సమర యోధులను నిర్బంధించింది ఇక్కడి సెల్యులర్ జైలులోనే అని అమిత్ షా వివరించారు.
పోర్టు బ్లెయిర్ అనే పేరు ఏర్పడడానికి ఒక కారణం ఉంది. బ్రిటీష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ ఇక్కడ పరిపాలన చేశాడు. బంగాళాఖాతంలో ఉన్న ఓడరేవుని మరియు బ్రిటిష్ అధికారి పేరును కలుపుతూ ఈ పేరు ఏర్పడింది. ఇకనుంచి దీనిని శ్రీ విజయపురం గా వ్యవహరిస్తారు.