నీతులు వల్లిస్తున్న నేతలు: రైతుల పేరుతో డ్రామాలు
ఢిల్లీ శివార్లలో హైవేలను ఆక్రమించి రైతుల పేరుతో నాటకం రెండు నెలలుగా నడుస్తోంది. నిజంగా రైతులే ఆందోళన చేస్తే అది నాటకం కాదు. కానీ రైతులు కొందరే. కాని వారు ఎందరో. చివరకు అన్య మతస్తులు సిక్కుల్లా తలపాగాలు పెట్టుకుని గుంపులో చొరబడ్డారు. రిపబ్లిక్ డే నాడు రైతుల పేరుతో అరాచకం జరిగింది. వందల మంది పోలీసులు గాయపడ్డారు. ఎర్రకోటపై వేరే జెండా ఎగురవేసి జాతి పరువు తీశారు. దీప్ సిద్ధూ తదితరులు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు చేయించారని కేసు నమోదైంది. ఇంత జరిగిన తర్వాత, ఇన్నాళ్లూ ఈ నాటకానికి వంత పాడిన రాజకీయ నాయకులు నీతులు వల్లిస్తున్నారు. హింస వద్దు. శాంతి ముద్దు అని డైలాగులు చెప్తున్నారు. రాహుల్ గాంధీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకూ వీళ్లందరూ ఇప్పుడు శాంతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పోజు కొడుతున్నారు. ఢిల్లీలో హింసకు పాల్పడిన దోషులకు శిక్ష పడాల్సిందేఅ ని కేజ్రీవాల్ ఎంతో ఉదారంగా ప్రకటన చేశారు. హింసకు తావులేదంటూ రాహుల్ గాంధీ నీతిని బోధించారు.
రైతుల పేరుతో ఇంత అరాచకం జరగడంతో రెండు సంఘాల నేతలు మనస్తాపం చెందారు. ఈ ఆందోళన నుంచి తప్పుకొంటున్నామని ప్రకటించారు. ఇలా ప్రకటించిన వారిలో భారతీయ కిసాన్ యూనియన్ వారు కూడా ఉండటం విశేషం. కేంద్రం అవసరమైన మార్పులతో చట్టాలను సరికొత్తగా ఆవిష్కరిస్తామని పదకొండు విడతల చర్చల్లో చెప్పింది. అయినా రైతు సంఘాల వాళ్లు నో అన్నారు. రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల ర్యాలీకి కూడా ప్రభుత్వం అనుమతించింది. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ఒక రూటు సూచించారు. దాన్ని ఉల్లంఘించిన దుష్టులు, దుర్మార్గులు, దేశ ద్రోహులు ఎర్రకోటను ఆక్రమించే ప్రయత్నం చేశారు. పోలీసుల మీదే దాడి చేశారు. వాళ్లను అలా రెచ్చగొట్టిన ప్రముఖ నాయకులు కొందిరపైనా కేసులు నమోదయ్యాయి. అయితే వీరికి కఠిన శిక్ష పడితేనే భవిష్యత్తులో జాతి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి దుర్మార్గులు భయపడతారు.