బిహార్లో నితీశ్ సారథ్యంలోని సంకీర్ణ సర్కారు విశ్వాస పరీక్ష నెగ్గింది. 160 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణానికి మద్దతు ఇచ్చారు.
బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీశ్ ఆగస్ట్ 10న ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్జేడీకి 16, జేడీయూకు 11 మంత్రిపదవులు దక్కాయి. ఇక 2024 పైనే ఫోకస్ అని… బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని విజయం సాధిస్తామని నితీశ్ జోస్యం చెప్పారు. తనతో కలిసి వచ్చి మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ నేతలు పిరికిపందలని అందుకే సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. తనను బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయితే నితీష్, తేజస్వీ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ వాకౌట్ చేసింది.
ఇక నితీష్ సర్కార్ విశ్వాస పరీక్ష నెగ్గగానే …స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విజయ్ కుమార్ సిన్హాను ఎల్పీనేతగా ప్రకటించింది బీజేపీ. శాసనమండలిలో బీజేపీ పక్ష నేతగా సమ్రాట్ చౌదరిని ఎంపిక చేసింది పార్టీ.