బీహార్ లో మరోసారి మహా ఘట్బంధన్ ప్రభుత్వం కొలువుతీరింది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఈరోజు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో ఆయన బీహార్ కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, మహా కూటమి నేతలు హాజరయ్యారు.
బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకొని.. ఆయన తన రాజీనామాను గవర్నర్ కు నిన్న సాయంత్రం సమర్పించారు. అయితే ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ గెలవలేరని, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని నితీశ్ వ్యాఖ్యానించారు. విపక్షాలు ఐక్యంగా ఉంటే కేంద్రంలో బీజేపీని గద్దె దింపవచ్చని అన్నారు.