బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ ఈరోజు రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్ కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్ తో సమావేశమయ్యారు. అనంతరం గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పార్టీలోని అందరి ఆకాంక్ష మేరకే ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నట్టు నితీశ్ వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ తో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి జేడియూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో నితీశ్ ఉన్నారని సమాచారం. కొత్త ప్రభుత్వంలో కూడా సీఎంగా నితీష్ కుమారే ఉండనున్నట్టు సమాచారం.
బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి ఇవాళ గుడ్బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్ లో ముగిసిపోయింది.
నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం.. పాట్నాలోని రబ్రీదేవి ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.