నిమ్మగడ్డ దూకుడు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలకు చకచకా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా సీనియర్ ఐఎఎస్ అధికారి, స్వయంగా సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ చీఫ్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చేశారని, సాధారణ పరిపాలన విభాగం అధిపతిగా ఉండి కూడా తన ఆదేశాలను పట్టించుకోలేదని తన లేఖలో నిమ్మగడ్డ వివరించారు.
నిమ్మగడ్డ జోరు ఇంతటితో ఆగలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు, అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తారు. వారికి ఇచ్చే సర్టిఫికెట్లలో సీఎం జగన్ ఫొటో ఉంచకూడదని మరో లేఖను సీఎస్ కు రాశారు. అలాగే ఈ సర్టిఫికెట్లను సత్వరం జారీచేయాలని సూచించారు. ప్రతిపక్ష అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు రావంతో ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల ప్రకారం గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను చీఫ్ సెక్రటరీ బదిలీ చేశారు. ఇంత కాలం వారిని బదిలీ చేయడం కుదరదని సీఎస్ వాదించారు. కానీ సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపడంతో ఇప్పుడు రమేష్ కుమార్ చెప్పింది చేయడం మినహా సీఎస్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. చిత్తూరు ఆర్బన్ ఎస్పీని కూడా బదిలీచేశారు, నిమ్మగడ్డ ఆదేశంతోనే. అంతేనా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లను ఎస్ ఇసి రమేష్ కుమార్ బదిలీ చేశారు. వారిని అభిశంసించారు. ఈ ఉత్తర్వులను వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇక, ఎన్నికల విధులకు రాంరాం అని బెదిరించిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దారికి వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అధికార యంత్రాంగం రాజ్యాంగ నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్ ఆధీనంలో ఉంది. నేను చెప్పిందే శాసనం అని సీఎం జగన్ అన్నా, అనుకున్నా ప్రస్తుతానికి కుదరదు. నిమ్మగడ్డ పోరాట స్ఫూర్తి చూసిన తర్వాత అధికారులు అందరూ ఎవరికీ భయపడకుండా తమ డ్యూటీ తాము చేసేలా స్ఫూర్తి పొందితే బాగుండు అనేది పబ్లిక్ టాక్.