తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు చేశారు. కొద్దిరోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ కనిపించకుండా పోయింది. ఈ మిస్సింగ్ కేసు విశాఖపట్నంలో నమోదైంది. రాధను నక్సల్స్లోకి చేర్చారని శిల్పపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే NIA ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు నిర్వహించింది.
తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శిల్పను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. కాగా, మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టు నేత శంకర్ కొడుకు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
ఏపీలోని విశాఖపట్నంలో మూడేళ్ల క్రితం కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్పతో పాటు దేవేంద్ర, మరో సామాజిక కార్యకర్తపై అభియోగాలున్నాయి. విశాఖపట్నంలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసును తాజాగా ఎన్ఐఏకు అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు శిల్ప, తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో వివరించారు. వైద్యం పేరుతో రాధను దేవేంద్ర తీసుకెళ్లినట్లు.. ఆ తర్వాత తన కూతురు ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై NIA కేసు నమోదు చేసింది.