గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అతని గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్నేసింది. ముంబైలో ఆయన అనుచరులకు చెందిన దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్గా ఎన్ఐఏ అధికారులు మెరుపు దాడులు చేశారు. బాంద్రా, బోరివలి, పరేల్, గోరేగావ్, శాంటాక్రూజ్ తదితర ప్రాంతాల్లో దావూద్ కంపెనీకి చెందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు సాగాయి. ఈ దాడుల్లో భాగంగా దావూద్ అనుచరుడు సలీమ్ ఫ్రూట్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో విధ్వంస రచనకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై దావూద్ కు చెందిన డీ కంపెనీ హవాలా ఆపరేటర్లపై ఎన్ఐఏ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కు దావూద్ తో సంబంధాలున్నాయన్నఆరోపణలతో ఆదిశగా కూడా ఎన్ఐఏ విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. దేశంలో దాడులకు ముఖ్యంగా… రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘావర్గాలకు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ ఇబ్రహీం, అతడి హవాలా ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది.