న్యూఇయర్ కానుకగా కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకం కింద ఇచ్చే నిధుల్ని రిలీజ్ చేసింది. రూ.20,900 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
10వ విడత కింద మోదీ వర్చువల్ విధానం ద్వారా వీటిని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్ల 9 లక్షలమందికి ఈ నిధులు చేరాయి. ఈ సందర్భంగా పలువురు రైతులతో మోదీ మాట్లాడారు. రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందామని తెలిపారు. మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 8 శాతానికి పైగా ఉందని అన్నారు.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతియేటా ఆరువేలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది.
అలాగే దేశంలోని 351 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పిఒ)లకు ప్రధాని మోడి రూ.14కోట్లు ఈక్విటీ గ్రాంట్స్ విడుదల చేశారు. దీని ద్వారా 1.24లక్షల మంది రైతులు లబ్ది పోందనున్నారు.