ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని చెబుతారు. ప్రస్తుతం అమెరికాలోని భారతీయులు కూడా ఒక కొత్త పరిష్కారం కనుక్కొన్నారు. కానీ ఇది ప్రమాదకరమైన విధానం కావటమే అసలు సమస్య. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఒక కొత్త విధానం ప్రకటించారు.
అమెరికా గడ్డ మీద పుట్టినంత మాత్రాన అమెరికన్ పౌరులు కారు అంటూ ట్రంప్ ప్రకటించారు. జన్మతః పౌరసత్వం విధానం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం.. లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతం భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతున్నది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ‘అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు’ అని ట్రంప్ ప్రకటించారు.
ఇప్పుడు ఈ ప్రకటన అమెరికా అంతటా ప్రకంపనలు కలిగిస్తోంది. ఈ చట్టం వచ్చే నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అంతకుముందు వరకు అమెరికాలో ఉంటున్న భారతీయులు లేదా ఇతర దేశాల దంపతులకు పుట్టిన బిడ్డలను అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత పుట్టిన వారికి ఇది లభించదు. దీంతో అమెరికాలో ఉన్న భారతీయ గర్భిణిలు నెలల నిండక ముందే డెలివరీకి సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా నివేదిస్తోంది.
ఈ సమస్యకు భారతీయులు కొత్త పరిష్కారాన్ని కనుక్కొన్నారు. నెలలు నిండకముందే పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారట. గత రెండు రోజుల వ్యవధిలోనే భారతీయ దంపతుల నుంచి వందల కొద్దీ ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా 8, 9 నెలల గర్భిణిలు సీ-సెక్షన్ (సిజేరియన్) కోసం తొందరపడుతున్నట్లు తెలిసింది.
కానీ ఈ ముందస్తు సిజేరియన్ లు ప్రమాదకరమైనవి అని వైద్య నిపుణులు అంటున్నారు. మొత్తం మీద పౌరసత్వం కోసం ఇటువంటి మార్గాలకు వెళ్లటం మంచిది కాదని చెబుతున్నారు.