యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఎంసీ, ఎన్సీపీ తమ పార్టీతో పొత్తులు కుదుర్చుకున్నాయని ఆ పార్టీ వర్గాలంటున్నాయి . బులంద్ షహార్ జిల్లా అనూప్ షహర్ నుంచి ఎన్సీపీ అభ్యర్థి కేకే శర్మ, మీర్జాపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థి లలితేశ్ ప్రతాప్ త్రిపాఠీ పోటీచేయడం దాదాపు ఖరారైంది. ఆర్జేడీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఆర్ఎస్, శివసేన నాయకత్వాలు అఖిలేశ్ కు మద్దతుగా నిలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీల చీఫ్ లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.
అటు బీజేపీ తరపున ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డాతో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారం చేయనున్నారు. దీంతో తమకు మద్దతు ప్రకటించిన ఇతర పార్టీల నాయకులతో ప్రచారం చేయించాలని అఖిలేష్ భావిస్తున్నారు. వచ్చేవారం స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే, కేసీఆర్ ఢిల్లీలో సమావేశం అవుతారని తెలుస్తోంది. శరద్ పవార్, మమతా బెనర్దీ తదితరులు వాళ్లతో కలిసి కార్యాచరణ రూపొందించే అవకాశాలున్నాయి.
మరోవైపు బీజేపీని వీడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ శిబిరంలో చేరుతుండడంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నా…అఖిలేశ్ కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇప్పటికే సొంతపార్టీ నుంచే అన్ని నియోజకవర్గాలకు ఆశావహులు చాలామంది ఉన్నారు. వారికి సీట్ల సర్దుబాటే కష్టం అనుకుంటే కొత్తగా వచ్చిన వారికి సీట్లు కేటాయించడం అంటే ఇబ్బందికరమే. ఎస్పీతో పొత్తుకు ఏడు పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పొత్తు ఖరారైతే వారికి సీట్లు కేటాయించాల్సి వస్తుంది.
ఇటీవలే బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన మాజీ మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్ నగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీనుంచి ఆర్ఎల్డీలో చేరిన ఆమ్ శీష్ రాయ్ కు ఇస్తామని ఆర్ఎల్డీ ఇప్పటికే వాగ్దానం చేసింది. ఇక మౌర్య కుమారుడు ఉత్కృష్ట మౌర్య 2017 లో ఊంచహార్ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్ధి మనోజ్ పాండేపై ఓడిపోయారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మౌర్య పట్టుబడుతున్నారు. మహానదళ్ నేత కేశవ్ మౌర్య కుమారుడు చంద్ర ప్రకాష్ మౌర్య ఇప్పటికే బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే బిల్సీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే శర్మ కొద్ది రోజుల క్రితం ఎస్పీలో చేరడంతో అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది.
మంత్రి పదవి వదులుకొని ఎస్పీలోకి వస్తున్న దారాసింగ్ చౌహాన్ మధుబన్ నియోజకవర్గంతో పాటు మవూ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు తన మద్దతుదారులకు అడుగుతున్నారు. కాంగ్రెస్ నుంచి చేరిన ఇమ్రాన్ మసూద్ సైతం తన మద్దతుదారులకు 6 సీట్లు అడుగుతున్నారు. టికెట్ రావేమోనని బీజేపీ, బీఎస్పీనుంచి చేరిన బ్రాహ్మణ నేతలు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.
టికెట్ల కేటాయింపులే గందరగోళం అంటే… అఖిలేష్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి భీం ఆర్మీ యూటర్న్ తీసుకుంది. దళితుల్ని అఖిలేష్ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకోసమే వాడుతున్నారని… భీం ఆర్మి అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఆరోపించారు. ‘‘ఆరు నెలలుగా అఖిలేష్ యాదవ్తో ఎన్నికల పొత్తు గురించి ఎదురుచూస్తున్నాను. అయితే అది మంచి ఫలితాలను ఇవ్వలేదు. వారు దళితుల నుంచి నాయకత్వాన్ని ఇష్ట పడడం లేదు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’’ అని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.