తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తిగా బిజీగా ఉండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన స్థానంలో కొత్త నాయకునికి పట్టం కట్టాలని అధిష్టానం తలపోస్తోంది. ముఖ్యంగా మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగం సీట్లకే పరిమితం కావడానికి హైకమాండు సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డి వర్గం మాత్రం ఈ వాదనాన్ని ఖండిస్తోంది. ప్రభుత్వ బాధ్యత పాటు పార్టీ బాధ్యత కూడా ఆయనే చూస్తారని చెప్పుకొని వస్తున్నారు. ఈలోగాని కాంగ్రెస్ హై కమాండ్.. తెలంగాణలో పార్టీ పరిస్థితులు సమీక్షించేందుకు రంగంలోకి దిగింది.
తెలంగాణలో పేలవమైన ఫలితాలకుగల కారణాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పీజే కురియన్ (కేరళ), రకీబుల్ హసన్ (అస్సాం), పర్గత్సింగ్ (పంజాబ్) ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం లక్ష్యం. కానీ 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిం ది. ఫలితాలు వెలువడిన రోజుననే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీతో మాట్లా డి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సర్వే నివేదికల్లో కాంగ్రెస్ వెనుకబడిందని ముందే హెచ్చరించినా ఎందుకు సీరియస్గా తీసుకోలేదని మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే దీపాదాస్ మున్షీని అధిష్ఠానం నివేదిక కూడా కోరింది.
పీసీసీ నాయకత్వానికి, ఎంపీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా వ్యవహరించిన మంత్రులకు మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు జరిగినట్టు ఏఐసీసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇంకా తప్పిదం ఎక్కడ జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? అనే దానిపై సమగ్ర నివేదిక కావాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏఐసీసీ తాజాగా ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాల సమాచారం.
ఈ కమిటీ నివేదిక తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేపడుతారు అని తెలుస్తోంది. పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఉంచుతారా మారుస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. లేనిపక్షంలో కార్య నిర్వాహక అధ్యక్షుల్ని నియమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.