రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతోంది. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. ఈనెల 7వ తేదీన నేతన్న బీమా పథకం ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నలకు బీమా పథకం ప్రారంభిస్తున్నామని కేటీఆర్ ఈరోజు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని కేటీఆర్ తెలిపారు. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హులవుతారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు.
చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా చనిపోతే, వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని కేటీఆర్ వివరించారు. పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు.