ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా స్వస్థలం నేపాల్ అన్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే ముంబైలో స్థిరపడినప్పటికీ నేపాల్ తో సంబంధం బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నేపాల్ హిందూ దేశంగా ఉండాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకు కారణాలు కూడా ఆమె విశ్లేషించారు.
1950 సమయంలో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందినాక… నేపాల్ హిందూ దేశం గా ఏర్పడింది. దాదాపుగా 60 సంవత్సరాలు పాటు హిందూ దేశం గానే కొనసాగింది. నేపాల్ కు రాజు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన చేస్తూ హైందవ సాంప్రదాయాలు కొనసాగించింది.. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద అధికారికంగా హిందూ మత రాజ్యం గా నిలబడింది. ఈ లోగా చైనా కన్ను హిమాలయాల్లో ఒదిగిపోయిన ఈ చిన్న దేశం పై పడింది. అక్కడ కమ్యూనిస్టులకు డబ్బు , వసతులు, వనరులు ఇచ్చి ప్రోత్సహించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అధికారంలోకి తెప్పించారు. తర్వాత కాలంలో రాజ్యాంగాన్ని తిరగరాయించి నేపాల్ ను హిందూ మత రాజ్యాంగా తొలగించారు. కమ్యూనిస్టుల ప్రాభవాన్ని పెంచేశారు. ఈలోగా నేపాల్ ప్రభుత్వానికి భారీగా అప్పులు ఇచ్చిన చైనా.. వడ్డీల రూపంలో విపరీతంగా దోచేసుకుంది. దీంతో నేపాల్ ప్రభుత్వం పరిస్థితి అధ్వానంగా తయారైంది . దీంతో ప్రజల పరిస్థితి దారుణంగా మారిపోయింది.
సరిగ్గా ఈ అంశాల మీదనే మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా నిలిచిన నేపాల్ పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా మారిపోయిందని ఆవేదన చెందుతున్నారు. చైనా కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి నెలకొందని ఆమె అంటున్నారు. రాజ్యాంగాన్ని మళ్ళీ మార్పించుకుని హిందూ రాజ్యంగా నెలకొల్పినట్లయితే దేశమంతా ఏకతాటి మీదకు వస్తుందని, నేపాల్ ను బాగు చేసుకునే అవకాశం ఉంటుందని మనీషా కొయిరాలా అభిప్రాయపడుతున్నారు.