విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించిన కొన్నిగంటలకే అధికార ఎన్డీయే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో ఉంటారని ప్రకటించారు బీజేపీ చీఫ్ నడ్డా. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
”మొదటిసారి గిరిజన మహిళా అభ్యర్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నాం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ముని ప్రకటిస్తున్నాం’’ అని సమావేశం అనంతరం నడ్డా తెలిపారు.
ద్రౌపది ఎన్నికైతే భారతదేశపు మొదటి గిరిజన అధ్యక్షురాలు, అలాగే రెండవ మహిళా రాష్ట్రపతి అవుతారు.
అత్యంత మారుమూల, వెనుకబడిన జిల్లాలలో పేదరికంతో పోరాడుతున్న గిరిజన కుటుంబంలో జూన్ 20, 1958న జన్మించారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన సంఘం నుంచి వచ్చిన ద్రౌపది ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె మయూర్భంజ్లోని రాయ్రంగ్పూర్ నుంచి బిజెపి టిక్కెట్పై రెండుసార్లు(2000, 2009) ఎమ్మెల్యే అయ్యారు. ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఆమె తన రాజకీయ జీవితంలో పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ముర్ము 2013 నుంచి 2015 వరకు BJP ST మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా పనిచేశారు.
ఆమె 1997లో కౌన్సిలర్గా గెలుపొంది.. ఒడిశాలోని రాయంగ్పూర్ వైస్-ఛైర్పర్సన్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం ఆమె BJP ST మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (మాజీ టీఎంసీ నాయకుడు) అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.