అమ్రావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సండే (హాలిడే) కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై రాణా దంపతులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ”మాతోశ్రీ” నివాసం వద్ద హనుమాన్ చాలీసా పఠనం చేస్తామంటూ రాణా దంపతులు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో వెళ్లి నవనీత్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమకు దేవాలయం వంటి మాతోశ్రీని అవమానించినందుకు క్షమాపణ చెప్పేంతవరకూ అక్కడ్నించి కదిలేది లేదని కార్యకర్తలు పట్టుబట్టారు. బారికేడ్లు దాటుకుని భవంతిలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు రాణా దంపతులకు నోటీసులు ఇచ్చారు. అనంతరం అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153(ఎ), ముంబై పోలీస్ చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాణా దంపతుల న్యాయవాది బెయిల్ పిటిషన్ వేశారు.