జమ్ముకశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కు గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దేవేంద్రరాణా, సూర్జిత్ సింగ్ స్లతియాలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మాజీ ఎమ్యెల్యే రాణా, మాజీ మంత్రి స్లితాయా రాజీనామాలు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాకు అందాయని, వాటిని ఆయన ఆమోదించారని ఎన్సీ ప్రతినిధి ట్వీట్ చేశారు. దశాబ్దానికి పైగా జమ్ము రీజియిన్ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ గా ఉంటున్న రాణా ఒమర్ అబ్దుల్లాకు సన్నిహితుడు.
కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కు రాణా స్వయానా తమ్ముడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటిది ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం అంటే పెద్దదెబ్బేనని చెప్పవచ్చు. అయితే జమ్ము ప్రజల ప్రయోజనాలు, వారి ఆశలు, ఆకాంక్షలే ప్రధానమని రాణా చెప్పారు.
డోగ్రా స్వాభిమాన్ సంస్థకు చెందిన చౌదరీ లాల్ సింగ్, నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన హర్షదేవ్ సింగ్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో రాణాతో వారు సమావేశమయ్యారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న పరిణామాల ఫలితంగా దశాబ్దాలుగా జమ్మూ ప్రాంతం నష్టపోతున్నట్లు భావిస్తున్న ఆయన జనవరి 30 న ‘జమ్మూ డిక్లరేషన్’ ప్రతిపాదించారు. జమ్మూ కాశ్మీర్లోని విభిన్న సంఘాలు, విభిన్న ప్రాంతాల మధ్య ఐక్యత, విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దీనిని ఉద్దేశించారు. రాణా చేరికతో జమ్మూలో బిజెపి మరింత బలోపేతం అవుతుందని…ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.