జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా కల్పించిన కేంద్రం… ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిపే దిశలో కీలకమైన ముందడుగు వేయబోతోంది. ఈ నెల 24న ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కానున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాన్ని తిరిగి రాష్ట్రంగా మార్పు, ఎన్నికల నిర్వహణ సహా పలు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 2019, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసిన సంగతి తెలిసింది.
ఇక తాజాగా హోంమంత్రి అమిత్ షా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతంలోని భద్రత, అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిపారు. రెండు సమావేశాలలో కూడా జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ కార్యదర్శి అజయ్ భల్లా పాల్గొన్నారు.భద్రతా అంశాలపై జరిగిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, కేంద్ర నిఘా సంస్థలు, భద్రతా సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ సమగ్రాభివృద్ధికి తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సమావేశాలలో స్థానికులకు ఉపాధి కల్పన, రైతుల ఆదాయం పెంపొందించడం, ప్రధాన మంత్రి ప్యాకేజి కింద చేపట్టిన పధకాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ శరణార్ధుల పునరావాసం వంటి అంశాలపై చర్చించారు.
వచ్చేవారం జరిగే సమావేశానికి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ లోనెతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలకు సమాచారం అందించినట్లు తెలిసింది. తనకు ఈ సమావేశం గురించి అధికార వర్గాలు టెలిఫోన్ లో తెలిపినట్లు మెహబూబ్ ముప్తి నిర్ధారించారు. ఎనిమిది రోజుల క్రితమే కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా ప్రకటించడం గమనార్హం.
ఇప్పటి వరకు పునర్విభజన కమిటీ సమావేశాలకు నేషనల్ కాన్ఫరెన్స్ దూరంగా ఉంటున్నది. కాగా, కాశ్మీర్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయని, అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకొంటున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.