ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజక వర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
ఏపీలో తెలుగుదేశం జనసేన బిజెపి పొత్తు కుదిరిన మొదట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటించి వెళ్లారు. చిలకలూరిపేట సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మోడీతోపాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అయితే చిలకలూరిపేట సభలో నరేంద్ర మోడీ.. ఎక్కడ వైయస్ జగన్ మీద నేరుగా విమర్శలు చేయలేదని, ఏపీ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకు పడలేదని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు ప్రధానమంత్రి స్థాయిలోని వ్యక్తి ఉద్రేక ప్రసంగాలు చేయరని హుందాతో కూడిన ప్రసంగాలే ఉంటాయని బిజెపి వర్గాలు సమర్ధించుకున్నాయి.
మరి ఈ క్రమంలో రెండు రోజుల పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ ప్రసంగం ఎలా ఉంటుంది అనే దానిమీద ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి పర్యటన ఈ విధంగా ఉండబోతుంది.
మే 3,4 తేదీల్లో ప్రధానమంత్రి ఏపీలో పర్యటిస్తున్నారు.
3న మధ్యాహ్నం 2:45 కి పీలేరుకి వస్తారు.
సాయంత్రం 6:30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు.
4న మధ్యాహ్నం 3:45 కి రాజమండ్రి చేరుకొంటారు .సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు.
ఈసారి ప్రధానమంత్రి పర్యటన మీద సర్వత్ర ఆసక్తి నెలకొంది.