Narendra Modi || మన్ కీ బాత్ లో తెలుగు వారికి ప్రశంస…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజా మన్ కీ బాత్ లో తెలుగు వారిని ప్రశంసించారు. ప్రతీ నెల చివరి ఆదివారంలో నిర్వహించే మన్ కీ బాత్ ద్వారా ప్రధాని.. దేశ ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి రేడియో ద్వారా ప్రసంగం చేస్తుంటారు. ఈ నెల చివరి ఆదివారం కావటంతో మే నెల 25వ తేదీన ఆయన .. తాజా ప్రసంగం చేశారు. వర్తమాన పరిస్థితులు, భవిష్యత్ మార్గదర్శనం గురించి విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మన తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించటం విశేషం.
…..
ప్రధానమంత్రి తన ప్రసంగంలో తెలంగాణ మహిళలను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లాలోని మహిళా రైతులు డ్రోన్ల సహాయంతో వ్యవసాయం చేయటాన్ని ఆయన మెచ్చుకొన్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారని, పండ్ల తోటలకు పురుగుమందులు, జల ధార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మహిళలను “స్కై వారియర్స్”గా మోదీ అభివర్ణించారు. డ్రోన్ల ద్వారా వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు అనీ…. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు తగ్గించవచ్చు అని మోదీ పేర్కొన్నారు.. “డ్రోన్ టెక్నాలజీ”ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ పరిణామం ఒక గొప్ప ముందడుగు అని ఆయన వివరించారు.
…..
ముఖ్యంగా తెలంగాణ లోని డ్రోన్ల వినియోగంతో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం మెరుగు అయిందని మోదీ విశ్లేషించారు. ఇంతటి విప్లవానికి కారణమైన మహిళలను డ్రోన్ దీదీలుగా ఆయన సంబోధించారు. ఇటువంటి చొరవ ద్వారా సమాజంలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ‘డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్’ పథకం కింద మహిళా సమూహాలకు రాయితీతో డ్రోన్లు అందిస్తోందని, శిక్షణా కేంద్రాలు, “డ్రోన్ లైసెన్సింగ్” సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి అని ఆయన గుర్తు చేశారు.
…..
ఇదే ప్రసంగంలో మోదీ.. ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తావించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన యోగా గురించి చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చే నెల 21 న జరుగుతుందని వివరించారు. విశాఖపట్నంలో జరిగే “అంతర్జాతీయ యోగా దినోత్సవం” కార్యక్రమంలో మోడీ హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. యోగా డే రోజున అంతా యోగా చేయాలన్న ఉద్దేశ్యాన్ని మోదీ వ్యక్తం చేశారు.
…….
ఈ సందర్భంగా విశాఖపట్నం గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖపట్నం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి అని మోడీ కొనియాడారు. విశాఖ పరిసరాల్లో యోగా చేయడం అనుభూతిని మరింత గొప్పగా చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగ ఆంధ్ర’ అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రతి గ్రామానికి, పాఠశాలకు యోగా సాధన పరిచయం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో 10 లక్షల మందికి పైగా యోగా అభ్యాసకులు పాల్గొనబోతున్నాట్లు వెల్లడించారు. ప్రత్యేక శిబిరాలు, స్కూల్ యోగా ప్రోగ్రామ్లు, మెగా ఈవెంట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
….
మొత్తం మీద మన్ కీ బాత్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలను ప్రస్తావించటం మీద సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ రెండు కార్యక్రమాల మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకొంటున్నారు.