
PM interacting with the students, teachers and parents, during the 5th edition of Pariksha Pe Charcha 2022, at Talkatora Stadium, in New Delhi on April 01, 2022.
ఏప్రిల్లో వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పరీక్షల్ని ఉత్సవాల్లా, పండగల్లా భావించాలంటూ..వాటిని సంబరంగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామంటూ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులు తన కలలు, ఆకాంక్షల్ని పిల్లలపై ఎప్పటికీ రుద్దకూడదని హితవు పలికారు.

‘పరీక్షా పే చర్చ-2022’ ఐదో విడత కార్యక్రమాన్ని ‘పరీక్ష యొక్క మాటలు, ప్రధాన మంత్రితో’ అనే నినాదంతో నిర్వహించారు. పరీక్షలకు ముందు ఎదురయ్యే సమస్యలు, పరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, ఒత్తిడిని తట్టుకోగలగడం వంటివాటి పిల్లలకు విడమరిచి చెప్పారు.
తాము ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం గురించి ప్రస్తావిస్తూ… 21 వశతాబ్దపు ఆకాంక్షల్ని నెరవేర్చుతుందన్నారు. సరికొత్త ఈ విధానం భారత దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తుందన్నారు. ఈరోజుల్లో విజ్ఞానం మాత్రమే సరిపోదని, నైపుణ్యాన్ని కూడా సాధించాలని చెప్పారు. విజ్ఞానం, నైపుణ్యాల సమాహారంపై నూతన విద్యా విధానంలోని సిలబస్ దృష్టి సారించిందన్నారు ప్రధాని. ప్రతి బిడ్డ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభతో పుడతారన్న మోదీ వారి శక్తిసామర్థ్యాలను పెద్దవాళ్లు గుర్తించగలగాలన్నారు.
తమ కలలను నెరవేర్చుకోవాలా? తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలా? అనే సందిగ్ధంలోకి పిల్లలను నెట్టవద్దని..వారిలో అయోమయ పరిస్థితికు తల్లిదండ్రులు కారకులు కావద్దని ఆయన అన్నారు. వారికి ఆసక్తి ఉన్న అంశాలపై ప్రోత్సహిస్తూ..వారి బలాన్ని గుర్తిస్తూ అన్నివిధాలా అండగా చేదోడుగా ఉండాలనీ చెప్పారు.

పిల్లలు ఎప్పటికీ ఒకరి సానుభూతి కోసం చూడవద్దన్నారు మోదీ. ‘‘మీ సమస్యలపై మీరే ఆత్మవిశ్వాసంతో పోరాడాలి” ‘‘మీ జీవితం నుంచి నెగెటివిటీని నిర్మూలించడానికి సవాళ్ళను ఎదుర్కొనాలి’ అని చక్కగా వివరించారు. ‘‘మనం తరచూ ప్రేరణనిచ్చే ఇంజెక్షన్ కోసం లేదా ప్రేరణనిచ్చే సూత్రం కోసం చూస్తూ ఉంటాం. మనల్ని వెనుకకు లాగుతున్నదేమిటనే దానిని మనం మొదట చూడాలి, వాటిని దూరంగా ఉంచాలి’’ అని అంటూ పిల్లల్లో కొత్త శక్తిని నింపే ప్రయత్నం చేశారు మోదీ.

ఇక జ్ఞాపకశక్తి గురించి మాట్లాడుతూ అది గొప్ప ఉత్ప్రేరకమని …జీవితంలోనో నైపుణ్యాలను పదునుపెట్టుకునేందుకు అది సాయపడుతుందని చెప్పారు. ఓ పాత్రలో ఓ నాణేన్ని పెట్టి, నీటిని పోసి, ఆ నీటిని బాగా కదిలించినపుడు, దానిలోని నాణెం మనకు కనిపించదని అలాంటిదే జ్ఞాపకశక్తి అని మోదీ అన్నారు. మనసును ప్రశాంతంగా, స్థిమితంగా, స్థిరంగా ఉంచితే జ్ఞాపకశక్తి పెరుగుతందన్నారు. మంచి ఫలితం లక్ష్యంగా పెట్టుకోవాలి కానీ…అందుకు రోజుకు 18 గంటలు పనిచేయడమే సరి అనుకోవద్దని చెప్పారు.
అంతేకాదు పరీక్షలకోసమే చదవాలనేది సరైన పద్దతి కాదన్నారు. పరీక్షల కోసం చదివితే నేర్చుకోవడంపై కాకుండా ఉత్తీర్ణత సాధించడం, మార్కులను పొందడంపై మాత్రమే మన దృష్టి ఉంటుందని చెప్పారు. పోటీల వల్ల జీవితం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. ఇక బాలికను చదివించాలని పిలుపునిచ్చారు ప్రధాని. బాలికల్ని, యువతుల్ని చదివించని సమాజం ఎన్నడూ బాగుపడబోదన్నారు. గతంలో ఆడపిల్లలకు పెళ్లిచేస్తే వారు స్థిరపడినట్టే అని వారి విద్యను నిర్లక్ష్యం చేసేవారని…ఇప్పుడా పరిస్థితిలేదని…సమాజంలో ఆ దిశగా మార్పు రావడం మంచి పరిణామమని అన్నారు. మహిళాశక్తే దేశాభివృద్ధికి కీలకమని ఈ తరం గుర్తించిందని అన్నారు.