ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి అక్కడినుంచే మాట్లాడిన ఆయన… 20 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు.
https://twitter.com/narendramodi/status/1518128508190720000?t=T_3hO6aEmZV2Y0g_thbcSw&s=19
జమ్ముకశ్మీర్ యావత్ దేశానికి సరికొత్త నమూనాగా నిలుస్తోందని ఆయన అన్నారు. పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తరువాత తొలిసారి ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన పర్యటన కొనసాగుతోంది. భారత ప్రధానికి జమ్ముకశ్మీర్ ప్రజలు సాదరస్వాగతం పలికారు.
కశ్మీర్లో పంచాయతీ ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా 100 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు. అభివృద్దిలో కశ్మీర్ దేశానికి సరికొత్త నమూనాగా నిలుస్తోందని మోదీ అన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరడం ఆనందంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కశ్మీరు లోయలో అమలవుతున్నాయన్నారు. గతంలో జమ్మూ-కశ్మీరు అభివృద్ధి కోసం తయారు చేసిన ఫైలు ఇక్కడికి చేరుకోవాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం పట్టేదని, నేడు మూడు వారాల్లోనే చేరుకోగలుగుతోందని చెప్పారు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ కి ఉదాహరణ జమ్మూ-కశ్మీరు అన్న
మోదీ…పర్యాటక రంగం మళ్ళీ ఊపందుకుంటోందన్నారు. ‘ఒకే భారత దేశం, శ్రేష్ఠ భారత దేశం’ అని అన్ని కాలాల్లోనూ జమ్మూ-కశ్మీరుకు అనుసంధానాన్ని (కనెక్టివిటీని) కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
జమ్మూ-కశ్మీరు అభివృద్ధికి నూతనోత్తేజాన్ని అందించడానికి వేగంగా కృషి జరుగుతోందన్నారు. కన్యాకుమారినుంచి ఒకే రోడ్డు ద్వారా ప్రయాణిస్తూ వచ్చి వైష్ణోదేవిని సందర్శించే రోజు ఎంతోదూరంలో లేదనీ మోదీ అన్నారు.
పంచాయతీరాజ్లో మహిళా సాధికారత కోసం తాము గట్టి కృషి చేస్తున్నామని తెలిపారు. నీటి సంరక్షణ పట్ల మహిళలకు శిక్షణనిచ్చి ప్రోత్సహించాలని పంచాయతీలను కోరారు. ఆర్గానిక్ సాగు పద్ధతులవైపు మళ్ళాలని పిలుపునిచ్చారు.
ఇక మోదీ సందర్శించిన సాంబ జిల్లాలోని పల్లి గ్రామం ఆదివారం దేశ చరిత్రలో ఓ రికార్డు సృష్టించింది. మోదీ 500 కేవీ సోలార్ ప్లాంటును జాతికి అంకితం చేయడంతో ఈ గ్రామం కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా ఘనత సాధించింది. దీనిని కేవలం సుమారు మూడు వారాల్లోనే నిర్మించడం మరో విశేషం. గ్రామ్ ఊర్జా స్వరాజ్ ప్రోగ్రామ్లో భాగంగా దీనిని నిర్మించారు. 6,408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,500 సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 340 ఇళ్ళకు క్లీన్ ఎలక్ట్రిసిటీ అందుతుంది.