కేంద్ర మైనార్టీవ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్పీసింగ్ కూడా పదవికి రాజీనామా చేశారు. ఇద్దరూ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారి పదవీకాలం ముగియడంతో పదవుల నుంచి తప్పుకున్నారు.అయితే నక్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించనున్నారని ప్రచారం జరిగింది. ఉదయం నక్వీ నడ్డాతోనూ, అమిత్షాతోనూ భేటీ అయ్యారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో మైనార్టీ అయిన నక్వీని ఉపరాష్ట్రపతి బరిలో నిలిపితే కొంతవరకైనా ముస్లింల మద్దతు కూడవచ్చని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ పేర్లు కొన్నిరోజులుగా వినిపిస్తుండగా తాజాగా నక్వీ పేరు తెరపైకి వచ్చింది. ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.