నాగాలాండ్ రాష్ట్ర అవతరణోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నాగా తెగల సాంస్కృతిక
హార్న్బిల్ ఫెస్టివల్ భారత ఈశాన్య ప్రాంతంలో జరిగే అతిపెద్ద పండుగలలో ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమా సమీపంలోని నాగా తెగ ప్రజల వారసత్వ గ్రామమైన కిసామాలో ప్రతి ఏడాది ఈ పండుగను నిర్వహిస్తారు.
నాగాలాండ్ గవర్నర్ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి నీఫియు రియోల సమక్షంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగుతాయి. నాగాలాండ్ రాష్ట్రంలోని 17 తెగలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో సంప్రదాయ దుస్తులతో పాల్గొని నృత్య గీతాలను ప్రదర్శిస్తాయి.
నాగా తెగలు తమ గొప్ప సంస్కృతి, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హస్తకళలను ప్రపంచానికి తెలియజేయటానికి ఈ వేదికను ఉపయోగించుకుంటాయి. ఆలాగే ఆ ప్రాంతంలో పర్యాటకం మరియు అనుబంధ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కూడా ఒక మార్గంగా నిలుస్తున్నది.
ఈ పండుగను ఆస్వాదించడానికి మన దేశం నుంచే కాక విదేశాల నుండి అనేక మంది పర్యాటకులు నాగాలాండ్ ను సందర్శిస్తారు. గత 21 సంవత్సరాలగా గొప్పగా సాగుతున్న ఈ ఉత్సవాలతో “హార్న్బిల్ ఫెస్టివల్” పండుగలకే పండుగగా ప్రపంచవ్యాప్తపు కీర్తిని పొందింది.