16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల వివాహం జూన్ 8న ముస్లిం ఆచారాల ప్రకారం జరిగింది.
‘ముస్లిం చట్టంలో యుక్తవయస్సు, మెజారిటీ ఒకటేనని.. ఒక యువతి 15 సంవత్సరాల వయస్సులో మెజారిటీని పొందుతుందని ఒక ఊహ ఉంది’ అని ముస్లిం జంట వాదించారు. షరియా చట్టాన్ని ప్రస్తావిస్తూ, యుక్తవయసు వచ్చిన ముస్లిం అబ్బాయి లేదా ముస్లిం అమ్మాయి, వారు ఇష్టపడే వారిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని.. అందులో సంరక్షకులకు జోక్యం చేసుకునే హక్కు లేదని వారు వాదించారు.
దీనిపై జస్టిస్ బేడీ తీర్పునిస్తూ, “ముస్లిం అమ్మాయి వివాహం ముస్లిం పర్సనల్ లా నియంత్రిస్తుందని చట్టం స్పష్టంగా ఉంది” అని పేర్కొన్నారు. సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా రచించిన ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ మొహమ్మదీన్ లా’ పుస్తకంలోని ఆర్టికల్ 195 ప్రకారం, పిటిషనర్ యువతి 16 ఏళ్లు పైబడిన అమ్మాయి కాబట్టి తనకు నచ్చిన వ్యక్తితో వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి యువతి అర్హురాలని పేర్కొన్నారు.
యువకుడి వయస్సు 21 సంవత్సరాల కంటే ఎక్కువ అని తెలిపారు. అందువల్ల పిటిషనర్లు ఇద్దరూ ముస్లిం పర్సనల్ లా ద్వారా ఊహించిన విధంగా వివాహ వయస్సు కలిగి ఉన్నారు” అని బెంచ్ పేర్కొంది.
చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని పఠాన్కోట్లోని ఎస్ఎస్పిని బెంచ్ ఆదేశించింది.
“పిటిషనర్లు వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు ఏ విధంగానూ హరించలేరు” అని ధర్మాసనం పేర్కొంది.