జ్ఞానవాపి మసీదు వివాదంపై తొలిసారి స్పందించారు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్. జ్ఞానవాపి ముందు ఆలయమేనని అయితే… ప్రతీ మసీదులోనూ శివలింగం కోసం ఎందుకు తవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాభీష్టం మేరకు రామజన్మభూమి ఆందోళనలో పాల్గొని సాధించామని.. అయితే అలాంటి ఉద్యమాలకు ఇప్పట్లో పిలుపునివ్వాలని అనుకోవడం లేదని అన్నారు సర్ సంఘ్ చాలక్.
జ్ఞానవాపి విషయంలో కూడా చరిత్రను మార్చలేమన్నారాయన. ఇప్పుడున్న హిందువులు, ముస్లింలు ఆ వివాదానికి కారణం కాదనీ గుర్తు చేశారు. ఈ దేశంపైకి దండెత్తి వచ్చిన వారి నుంచి ఇస్లాం ఈ దేశంలోకి వచ్చిందని… అయితే ఇప్పుడున్న ముస్లింలకు ఇక్కడి హిందువులు వ్యతిరేకం కాదనీ అన్నారు. అసలు ఇప్పటి ముస్లింల పూర్వీకులూ హిందువులేనన్న విషయం గుర్తెరగాలని మోహన్ భగవత్ అన్నారు. ఈ దేశపు హిందువులు తమకు వ్యతిరేకం అనే భావన, ఆలోచన ముస్లింలకు ఉండరాదనీ ఆయన అన్నారు. జ్ఞానవాపి విషయంలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయని… దానికి అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు.
“వాళ్ల ప్రార్థనా విధానం దేశం వెలుపల నుంచి వచ్చిందే. అది అనుసరిస్తున్న వాళ్లు బయటివాళ్లు కూడా కాదు. అయితే దానినే కొనసాగించాలని వారు అనుకున్నప్పుడు మనకొచ్చే ఇబ్బందేం లేదు. వారి ఆరాధనా విధానలను హిందువులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు” అని మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయనీ మాటలన్నారు.