ములుగు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి అనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి హనుమకొండకు తిరిగి వెళ్తుండగా పందింకుంట బస్ స్టాప్ సమీపంలో దుండగులు మల్లారెడ్డిని అడ్డగించి.. పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి చంపారు. మల్లారెడ్డికి ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో వ్యవసాయ భూమి ఉంది. అక్కడే ఎర్రమట్టి క్వారీ తోపాటు పలుచోట్ల పెట్రోల్ బంకులు కూడా నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా మల్లారెడ్డికి సంబంధించిన భూములపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భూ వివాదాల పరిష్కారానికి కొద్దిరోజులుగా తరచూ ములుగు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వస్తున్నాడు.
మల్లారెడ్డి మృతదేహానికి మంగళవారం స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తయింది. శరీరంపై మొత్తం 15 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం శవపరీక్ష ప్రకియను పోలీసులు వీడియో తీశారు. పదునైన కత్తులతో పొట్ట, మెడ, ఛాతీ భాగంలో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన మరణించినట్లు తేలింది. ఈ సంఘటనను సీరియ్సగా తీసుకున్న ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ విచారణకై మూడు ప్రత్యేక బృందాలను నియమించారు.
మరోవైపు మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిందెవరనేది తెలియాల్సి ఉంది. న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిరాతక హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదులపై దాడుల నివారణకు ప్రత్యే క చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఇదిలా ఉండగా, మల్లారెడ్డి హత్యను ఖండిస్తూ హైకోర్టులో పలువురు న్యాయవాదులు నిన్న నిరసన వ్యక్తం చేశారు.