కొంత కాలంగా రాజీనామా చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తలకు తెరదించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో స్పీకర్ ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తానని వెల్లడించారు. రాజీనామా తర్వాత ఉపఎన్నిక వస్తేనైనా తన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందేమోనని.. తన ప్రజలకు మేలు జరుగుతుందేమోనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తనకు సోనియా, రాహుల్ గాంధీ అంటే గౌరమని.. అందుకే విమర్శలు చేయడం లేదని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం తీరు తనను ఎంతగానో బాధించిందని వివరించారు. కొద్దిరోజులుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి.. బీజేపీ పార్టీలో చేరే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణాలో ప్రజాస్వామ్యం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. భవిష్యత్తులో శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లకు తప్పితే ఏ నియోజకవర్గానికీ నిధులు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఫామ్హౌజ్ చుట్టూ అమెరికాలో ఉన్నట్టు రోడ్లు ఉన్నాయి. కానీ రోజూ వేల మంది తిరిగే చౌటుప్పల్–నారాయణపురం రోడ్డు మాత్రం గుంతలమయమైంది. ఏ అభివృద్ధీ చేయలేని ఈ ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ఉండటం దేనికని రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్రెడ్డి తెలిపారు. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా బలహీనపడిందని వ్యాఖ్యానించారు. అవమానాలను భరిస్తూ కాంగ్రెస్లో ఉండాల్సిన అవసరం ఏముందని.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి లాంటి వారి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. కనీసం కమిటీల ఏర్పాటులో కూడా తమను భాగస్వాములను చేయలేదని.. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరితే అధిష్ఠానం కనీసం వారిని పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నపుడు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచానని.. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్ధులకు ఆర్థికసాయం చేశానని చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు 20 ఏళ్లపాటు కాంగ్రెస్ ను, సోనియాను తిట్టిన వ్యక్తి కింద పనిచేయాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రజలందరూ ఎటు చూస్తున్నారు?.. మోదీ గారి నాయకత్వంలో దేశం ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.. అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.