మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ స్పష్టతనిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్ఎస్ కు మాత్రమే ఉందని.. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు. ఈ మద్దతు మునుగోడుకే పరిమితం కాదని.. భవిష్యత్ లో కూడా టీఆర్ఎస్ తో పని చేస్తామని చాడ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పార్టీగా మతతత్వ పార్టీనీ ఓడించే పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు.
ఈరోజు మునుగోడులో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు రావాలని సీఎం కేసీఆర్ కోరినట్లు తెలిపారు. సీపీఐ తరపున పల్లా వెంకట్ రెడ్డి సభలో పాల్గొంటారన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పై చాడ వెంకట్రెడ్డి విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐని ఇబ్బంది పెట్టిందని.. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్ పోటీ చేసిందని అన్నారు.