మునావర్ ఫారుఖీ స్టాండ్ అప్ కామెడీ షోకి హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ షోను అడ్డుకుంటామని.. దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రటించడంతో నగరంలో వాతావరణం హీటెక్కింది. షోకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముందునుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. గతంలో హిందూ దేవతలను కించపరిచిన మునావర్ షోకు అనుమతి ఇస్తే వేదికను తగలబెడతామన్నారు. కానీ, మునావర్ స్టాండ్ అప్ కామెడీ షోకి మాదాపూర్ పోలీసులు అనుమతిచ్చారు. దీంతో ఈరోజు షో నేపథ్యంలో.. నిన్న ఉదయం రాజాసింగ్ ను ముందస్తు అరెస్టు చేశారు. ఆయన్ను లాలాగూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మునావర్ ఫారుకీ షోను అడ్డుకుని తీరుతాం. ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ నన్ను సస్పెండ్ చేసినా బాధపడను. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మలా నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చు. మునావర్ పూజించే మహ్మద్ ప్రవక్త బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను సస్పెండ్ అయినా మోదీ, అమిత్ షాలకు ఫాలోవర్ గా ఉంటా. పార్టీ కంటే ధర్మాన్ని కాపాడటమే నాకు ముఖ్యమని రాజాసింగ్ అన్నారు.
శిల్పకళా వేదికలో ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో మునావర్ షో ఇస్తున్నాడు. ఫారూఖీ లైవ్ షోను అడ్డుకోవడంతో పాటు వేదికను తగులబెడతామని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శిల్పకళా వేదికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల మార్గాల్లోనూ సిబ్బందిని మోహరిస్తున్నారు.