ముంబైలో 26/11 తరహా ఉగ్రదాడి జరగనుందని హెచ్చరిస్తూ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్ కు బెదిరింపు మెసేజ్ పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆధారిత ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు సందేశం పంపించారు.భారత్ లో ఆరుగురు వ్యక్తులు ప్లాన్ ను అమలు చేస్తారని తెలిపినట్లు వర్గాలు తెలిపాయి. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. బెదిరింపు సందేశం గురించి ఇతర ఏజెన్సీలకు కూడా సమాచారం అందించారు.
మహారాష్ట్రలోని రాయ్ఘడ్ తీరంలో గురువారం మూడు AK-47 రైఫిళ్లు, బుల్లెట్ లతో కూడిన పడవ కనుగొన్న తర్వాత ఈ బెదిరింపు సందేశం రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాయ్ఘడ్ తీరంలో పడవలో గన్స్ దొరకడం రాష్ట్రంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. స్థానిక పోలీసు అధికారులు అలాగే యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పడవను పరిశీలించారు. ఘటనా స్థలానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాన్ని కూడా రంగంలోకి దించారు.
ఆ పడవ ఓ ఆస్ట్రేలియా మహిళకు చెందిందని.. ఆమె భర్త కెప్టెన్ గా ఉన్నారని దర్యాప్తులో తేలింది. జూన్ లో మస్కట్ నుంచి యూరప్కు వెళుతున్న పడవను ప్రతికూల వాతావరణం, ఇంజిన్ సమస్య కారణంగా ఆస్ట్రేలియన్ జంట దానిని మధ్యలో వదిలేశారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్ లో ఒమన్ తీరానికి సమీపంలో ఈ పడవలోని సిబ్బందిని రక్షించారు. ఆ పడవ అక్కడ గల్లంతై ఇక్కడ ఒడ్డుకు చేరుకుందని కోస్ట్ గార్డ్ అధికారి తెలిపారు.