గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అప్పట్లో వైసీపీ నాయకుల మెప్పుకోసం చాలాచోట్ల పోలీసు అధికారులు రెచ్చిపోయారు. అమాయకులను తీసుకొచ్చి బంధించడం, చిత్రహింసలు పెట్టడం పరిపాటి గా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారాక బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
చట్టాలు నిబంధనలో గాలికి వదిలేసి వైసిపి పెద్దల మెప్పుకోసం ఏకంగా ముంబై హీరోయిన్ ని బెదిరించిన ఘటన బయటకు వచ్చింది.
ముంబై నటి కాదంబరి జెత్వానీ మీడియా ముందుకు వచ్చి అసలు విషయం బయట పెట్టారు. ఆమె వైద్యురాలు కూడా! వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను, ఆమె తల్లిదండ్రులనూ అరెస్టు చేసి నరకం చూపించారు. అంతర్జాతీయ స్మగ్లర్లు, ఉగ్రవాదుల తరహాలో తమను ఏపీ పోలీసులు అరెస్టు చేసి విమానంలో తీసుకొచ్చారని జెత్వానీ కుటుంబ సభ్యులు వాపోయారు.
ఈ వేధింపులకు విజయవాడ పోలీసులు కేంద్రంగా నిలిచారు.
ఐపీఎస్ విశాల్ గున్నీ నేతృత్వంలో జెత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడకు తీసుకొచ్చారు. మూడు రోజులపాటు వారిని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్హౌ్సలో ఉంచారు. తీవ్రంగా హింసించారు. ఫిబ్రవరి 6వ తేదీన కాదంబరిని రిమాండుకు పంపించారు.
ముంబైలో పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్పై ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోమని వత్తిడి చేశారు. ఆ కేసు ఉపసంహరించుకొంటేనే విజయవాడలో కేసును ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. ఆ పారిశ్రామికవేత్త నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్నేహితుడు కావడంతో, అతనిని లైంగిక వేధింపుల కేసు నుండి ఆదుకొనేందుకు విజయవాడ పోలీసులు వీరంగం సృష్టించినట్లు భావిస్తున్నారు.
ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని బాధితులు మీడియా ముందుకు వచ్చారు. కాదంబరి ముంబైలో ఓ చానల్లో మాట్లాడుతూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో తనకు 2015లో పరిచయం ఏర్పడిందని, అదే ఏడాది అతను తనకు పెళ్లి ప్రతిపాదన చేశాడని తెలిపారు.
కానీ… ఆయన నేపథ్యం తెలిసి తాను ఆ ప్రతిపాదన తిరస్కరించానని జెత్వానీ తెలిపారు. ‘‘విద్యాసాగర్కు పెళ్లయిన 14 నెలలకే భార్య వదిలేసి వెళ్లి పోయారు. ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని గుర్తించి అతన్ని దూరం పెట్టాను. అప్పటి నుంచి నగ్న వీడియో కాల్స్తో, అసభ్యకర సందేశాలతో నన్ను వేధించసాగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్లో విద్యాసాగర్ నాపై దొంగ కేసు పెట్టాడు’’ అని వాపోయారు.
ఈ కేసు తాలూకు వివరాలను ఆమె స్పష్టంగా వివరిస్తున్నారు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. అది కూడా ఓ ఫోర్జరీ డాక్యుమెంట్ను చూపించి ఈ కేసు పెట్టారు. జెత్వాని ముంబైలో ఇప్పుడు నివాసం ఉంటున్న ఫ్లాట్ను 2020లో కొనుగోలు చేశారు. అయితే 2018లో కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ మాత్రమే జరిగిన ఫ్లాట్లో ఆమె ఉంటున్నట్టు చూపడం గమనార్హం. దీని ఆధారంగా పోలీసులు కథను నడిపించారు.
త్వరలోనే విజయవాడ వచ్చి పోలీసులు బాగోతం మీద డిజిపి కి ఫిర్యాదు చేయాలని నటి కాదంబరి భావి స్తున్నారు.