వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం హైదరాబాద్ లోని ఆయనింటికి వెళ్లిన పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని ఏపీలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనింటికి వెళ్లిన పోలీసుల్ని అక్కడున్న సీఆర్పీఎప్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామన్నారు. అటు ఎలాంటి వారెంట్ లేకుండా వచ్చిన తన తండ్రిని అదుపులోకి తీసుకున్నారని రఘురామ తనయుడు భరత్ ఆరోపించారు. 30మంది పోలీసులుతమింటికి వచ్చి లాక్కెళ్లారని అన్నారు.
అరెస్టు చేసిన తరువాత సీఐడీ అధికారిక ప్రకటన వెలువరించింది. ఆయనపై ఐపీసీ 124ఎ, 153ఎ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో ఫిర్యాదులు అందాయని అందుకే అరెస్ట్ చేశామని సీఐడీ తెలిపింది.
ఇవాళ రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు. కొన్నిరోజుల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టుకుంటూ మరీ పోలీసులు లాక్కెళ్లారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.