ఎంపీ ఆత్మహత్య.. గుజరాతీలో సూసైడ్ నోట్..!..గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా..!
https://twitter.com/ANI/status/1363792316398452736
దాద్రా నగర్ హవేలీకి చెందిన ఎంపీ మోహన్ దేల్కర్ (58) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ముంబైలోని ఓ హోటల్లో ఆయన మృతదేహం లభ్యమైంది. అయితే ఆయన రూంలో సూసైడ్ నోట్ లభించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాన్నిముంబై పోలీసులు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే సూసైడ్ నోట్ గుజరాతీ భాషలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీ దేల్కర్ సోమవారం ఉదయం 11.00 గంటలకు ఎంపీ డ్రైవర్ తలుపు తట్టగా ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో డ్రైవర్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి, ఎంపీ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం మధ్యాహ్నం 1.50 గంటలకు డ్రైవర్ ఎంపీ స్టే చేస్తున్న రూం బాల్కానీలోకి దూకి చూడగా.. గదిలో ఎంపీ దేల్కర్ ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు కన్పించిందని డ్రైవర్ చెప్పినట్లు సదరు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విషయాన్ని పోలీసులకు కూడా చెప్పడంతో.. వెంటనే హోటల్కు చేరుకున్న పోలీసులు.. గది తలుపులు బద్దలు కొట్టి.. ఎంపీ మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్మార్టానికి పంపినట్లు తెలుస్తోంది.
కాగా, మోహన్ దేల్కర్ గతంలో దాద్ర నగర్ హవేలీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2019లో పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 1989లో తొలిసారిగా దాద్ర నగర్ హవేలీ నుంచి ఎంపీగా గెలుపొందారు.