భారత్ లోని రోడ్లపై ఇక విమానాలు కూడా దిగబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శత్రుదేశాలు మన వాయుసేనను, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి తలెత్తితే యుద్ధ విమానాలను “రోడ్ రన్వే”లతో(airstrips)నిర్మించిన జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ మార్గాల వైపు మళ్లిస్తారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడూ ఇలాగే ఎయిర్ స్ట్రిప్ లను వినియోగిస్తారు.
ఈ మేరకు పన్నెండు మార్గాలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. వాయు సేన సామర్థ్యాన్ని పెంచాలన్నదే కేంద్రం లక్ష్యంగా ఎయిర్ స్ట్రిప్స్ కి రూపకల్పన జరిగింది.
దేశంలో అతి పొడవైన ఎక్స్ప్రెస్ మార్గాన్ని (పూర్వాంచల్ -341 KM) మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత దేశ వికాసాన్ని, అదే మార్గంలో నిర్మించిన రోడ్డ్ రన్వే పై వాయు సేనకు చెందిన C-130 హెర్క్యులస్ విమానం ద్వారా దిగి భారత పరాక్రమాన్ని ప్రదర్శించారని చెప్పారు ప్రధాని.
దేశంలో ఎంపిక చేసిన 12 మార్గాలపై ఈ ‘రోడ్ రన్వే’లను నిర్మిస్తుండగా నిన్నటి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ మార్గం ప్రారంభోత్సవంతో దేశంలో మూడు చోట్ల ఇవి ఉపయోగంలోకి వచ్చాయి. ప్రారంభోత్సవం సందర్భంగా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ మార్గంపై నిర్మించిన రోడ్ రన్వే పై భారత వైమానికదళం గ్రాండ్ ఎయిర్ షోను నిర్వహించింది. మిరాజ్ 2000, AN-32 యుద్ధ విమానాలు, మిరాజ్, సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలతో పూర్వాంచల్ గగనతలంలో విన్యాసాలను చేపట్టి శత్రువుకు గట్టి హెచ్చరికే పంపింది.