హరప్పా నాగరికత విలసిల్లిన హర్యానా హిస్సార్ జిల్లాలోని రాఖీగర్హిలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు కొనసాగుతున్నాయి. తాజాగా అక్కడ 5 వేల ఏళ్లనాటి ఆభరణాలు తయారు చేసే కర్మాగారాన్ని కనుగొన్నారు. ఆ సమయంలో అక్కడినుంచి ఇతర దేశాలకు వ్యాపారం జరిగినట్టు అర్థమవుతోంది.
ఆ సమయంలో వారు వాడిన అద్భుతమైన సాంకేతికను చూసి పరిశోధకులే అవాక్కవుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కట్టడాలు, నగరాల నిర్మాణం కోసం వినియోగిస్తున్న టెక్నిక్లు, స్ట్రెయిట్ వీధులు, డ్రెయిన్లు ఇప్పటికే దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. చెత్త కోసం వీధుల మూలల్లో ఉంచిన డస్ట్బిన్లు అప్పట్లోనూ ఉపయోగించారు. ఇటీవల తవ్వకాల్లో ఇద్దరి అస్తిపంజరాలు బయటపడిన సంగతి తెలిసిందే. చనిపోయినవారు వినియోగించిన పాత్రలు సహా ఆమహిళలతో పాటే పాతిపెట్టారు. ఆ అస్థిపంజరాల నమూనాలనూ అధికారులు సేకరించి పరిశోధనకు పంపారు.
దాదాపు 32 ఏళ్లుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ తవ్వకాలు జరుపుతోంది. తాజాగా కనిపెట్టిన ఆభరణాల తయారీ కేంద్రం ఏఎస్ఐ ఇప్పటివరకు కనిపెట్టినవాటిలో పెద్దది, ముఖ్యమైనది. ఇంతకుముందు కొన్ని ఇళ్ల నిర్మాణాలు, వంటగది సముదాయంతో పాటు.. రాగి, బంగారు ఆభరణాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆకాలంలో ముఖ్యమైన వాణిజ్యకేంద్రంగా ఈ ప్రాంతం ఉండేదని నిర్థారించారు.
సింధూనదీ పరివాహకంలో బయటపడిన ప్రాంతాలు వేలఏళ్లనాటి అద్భుతమైన హరప్పా నాగరికత గురించి ప్రపంచానికి తెలియజేశాయి. ఇప్పటికే గుర్తించిన పెద్ద పట్టణాల్లో రాఖీగఢీ ఒకటి. హరప్పా నాగరికత చిహ్నాలతో కూడిన అతిపెద్ద పురావస్తు కేంద్రంగా రాఖీగర్హీని చెప్పవచ్చు. నాటి నాగరికతలో ప్రధాన మెట్రోపాలిటన్ సిటీగా వెలుగొందినట్టు ఆధారాలను బట్టి తెలుస్తోంది.
3,500 హెక్టార్లలో ఇది విస్తరించింది. అయితే అక్కడి గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పెద్ద టూరిస్ట్ హబ్గా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే స్థానికులు ఎక్కడిక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం వంటివి చేస్తుండడం ముందు నుంచీ తలనొప్పిగా మారింది. కేంద్రం ప్రకటించిన ఐదు ఐకానిక్ ప్రదేశాల్లో రాఖీగర్హి ఒకటి.