ఏప్రిల్ 6వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 41వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో.. పార్టీ శ్రేణులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఈ కాన్ఫరెన్స్ ప్రారంభంకానుంది.
మరోవైపు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బూతు స్థాయి నుంచి వివిద కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు ప్లాన్స్ వేస్తున్నారు. పార్టీ చరిత్రతో పాటు.. సాధించిన విజయాలు, పలు అంశాల గురించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా చర్చించనున్నారు. అయితే మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 6వ తేదీనే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
కాగా, 1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ జన సంఘ్ పార్టీని స్థాపించారు. అయితే 1977వ సంవత్సరంలో పలు పార్టీలతో కలిసి జనతా పార్టీగా మారింది. అయితే 1980లో జనతా పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పార్టీలోని సభ్యులకు ద్వంద్వ సభ్యత్వం ఉండటాన్ని (పార్టీ, ఆర్ఎస్ఎస్ సభ్యత్వాలు) రద్దు చేసింది. దీంతో మాజీ జన్సంఘ్ సభ్యులు ఆ పార్టీని వీడి.. కొత్త పార్టీకి పురుడుపోశారు. ఆ విధంగా 1980వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన బీజేపీని స్థాపించారు.