ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి మోదీని మోశారు. ఆయన పనితీరు అద్భుతం అని కొనియాడారు. భారత ప్రధాని ఏదైనా పని చేపట్టారంటే పూర్తయ్యే దాకా విశ్రమించరని అన్నారు. ఓ మరాఠీ దినపత్రికతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
“మోదీ ఏదైనా పనిని మొదలు పెట్టారంటే… అది పూర్తయ్యేవరకు వదలరు. అది ఆయన స్వభావం. ఆయనకు పాలనపై మంచి పట్టుంది. అదే తన బలం ‘ అని అన్నారు.
ఎన్సీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని మహాలో ఏర్పాటు చేయాలని మోదీ కోరుకున్నారని..అయితే తమ సిద్ధాంతాలు కలవవని అది అసాధ్యమని తాను స్పష్టం చేశానని పవార్ గుర్తుచేసుకున్నారు. మూడునెలలైనా రాష్ట్రంలో సంక్షోభం వీడకపోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం తాను ఆ ప్రతిపాదన చేసి ఉంటారని అన్నారు.
రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీ నాయకుడిగా ప్రధానిలో ఇన్నేళ్లలో మీరు గమనించింది, ఆయనలో చూసిన మార్పులేంటని అడిగిన ప్రశ్నకు పవార్ సమాధానమిచ్చారు. పాలనాపరమైన నిర్ణయాలు సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా లేకుంటే రిజల్ట్ కనిపించదని… కేవలం కష్టపడి పనిచేస్తే చాలదని…ప్రజల్ని మెప్పించగలగాలనీ అన్నారు. తన ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి , సహచర మంత్రులు, ఇతర నాయకులను కలుపుకుని పోవాలని అన్నారు. తన సహచరులను కలుపుకుపోవడంలో సమయానుగుణంగా భిన్నమైన పద్ధతిలో మోదీ వెళ్తున్నారని…గత ప్రధాని మన్మోహన్ సింగ్ లో అది కనిపించలేదని శరద్ పవార్ చెప్పుకొచ్చారు. ఇక శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా ఉన్న తమ ప్రభుత్వంలోని మంత్రులపై కేంద్ర సంస్థలు చర్యల గురించి ఎన్నడూ తాను మోదీ దగ్గర ప్రస్తావించలేదని, దాని గురించి భవిష్యత్తులో కూడా మాట్లాడబోననీ పవార్ స్పష్టం చేశారు.