త్వరలో ఎన్నికలు జరిగే ఈశాన్యాన ప్రచార వేడి పెరిగింది. ఇవాళ అంబస్సాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తరువాత గోమతిలోని రాధాకిషోర్ పూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. త్రిపురను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వాదినేని ఈ సందర్భంగా మోదీ అన్నారు. దశాబ్దాల కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాలనలో త్రిపుర పూర్తిగా వెనకబడిందని గుర్తు చేశారు. త్రిపురలో గతంలో పోలీసు స్టేషన్లన్నీ సీపీఎం అధీనంలో ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టబద్ధపాలన అమల్లోకి వచ్చిందని మోదీ అంబస్సా ర్యాలీలో అన్నారు. రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించామని, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. గ్రామాలను కలుపుతూ 5000 కిలోమీటర్ల మేర రోడ్లు వచ్చాయని, ఆప్టికల్ భైబర్, 4జి కనెక్టివిటీ గ్రామాలకు చేర్చామని చెప్పారు. గ్లోబల్ స్థాయికి త్రిపుర చేరుకుంటోందన్నారు. నౌకాశ్రయాలతో ఈశాన్య, త్రిపురలను అనుసంధానిస్తూ వాటర్వేస్ను అభివృద్ధి చేస్తున్నామని మెదీ తెలిపారు.
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 55 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 5 సీట్లు తమ భాగస్వామ్య పక్షమైన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)కి కేటాయించింది. కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 60 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.