సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోనున్నాయి. 719 కోట్ల రూపాయల వ్యయంతో అధునిక హంగులతో స్టేషన్ ను తీర్చిదిద్దనున్నారు. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్రమోదీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
అసలది రైల్వేస్టేషనా, ఎయిర్ పోర్టా అన్నట్టున్న రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి డిజైన్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మౌలిక సదుపాయాలు, రైల్వే ప్రయాణాన్ని మార్చేస్తోందని..అత్యాధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ నిలవబోతున్నదని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రతిపాదిత పనులను మూడేళ్లల్లో పూర్తి చేయాలని ఇండియన్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్ సబ్ అర్బన్ గ్రేడ్ 1 (NSG1) స్టేషన్గా గుర్తించిన ఏకైక రైల్వే స్టేషన్ ఇదే కావడం విశేషం. ఏటా 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తూ, రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వే స్టేషన్లు NSG1 పరిధిలోకి వస్తాయి.సికింద్రాబాద్ నుంచి నిత్యం 200 రైళ్లు వేర్వేరు ప్రాంతాలకు1.8 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంటాయి. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందించడానికి స్టేషన్ కాంప్లెక్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ ఓ మాస్టర్ ప్లాన్ను ఇప్పటికే రూపొందించింది. G + 3 అంతస్తులతో ఉత్తరం వైపు ఒక స్టేషన్ భవనం, దక్షిణం వైపు మరో భవనం, రెండు అంతస్తుల స్కై కన్కోర్స్ కూడా నిర్మించనుంది. రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్ , దక్షిణం వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఉత్తరం, దక్షిణం భవనాల దగ్గర ట్రావెలేటర్లతో పాటు 7.5 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా రెండు నడక మార్గాలను నిర్మించనుంది. ఇక ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేస్తుంది. ఇప్పటికే ఉన్న ప్లాట్ఫారమ్లను పునరుద్ధరించనున్నారు. ఇకపై ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్స్ వేర్వేరుగా ఉంటాయి. రైల్వే స్టేషన్ మొత్తానికి విద్యుత్ అందించేందుకు 5000 kWp సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు.