కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ.
కోవిడ్-19 వ్యాక్సిన్లను సరిపడా ఉత్పత్తి, సరఫరా చేసేందుకు తీవ్ర కృషి జరుగుతోందని వివరించారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో జిల్లా అధికారులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని … ఇంకా చెప్పాలంటే…యుద్దంలో ఫీల్డ్ కమాండర్లు పోషించే పాత్రను ప్రస్తుతం కోవిడ్-19పై పోరాటంలో జిల్లా అధికారులు పోషిస్తున్నారని అన్నారు. అధికారులు తమ విధి నిర్వహణకే పెద్ద పీట వేస్తున్నారని, కొందరు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోవడం బాధాకరమని అన్నారు. కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయినా సరే కొందరు ఇంట్లో ఉండి విధులు నిర్వహిస్తున్నారన్నారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో పాటించవలసిన ముఖ్యాంశాల్లో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ చాలా ముఖ్యమైనవని చెప్పారు. కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలని సూచించారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు, కర్ణాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన జిల్లాల అధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూలును 15 రోజులు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముందుగా షెడ్యూలును ఇవ్వడం వల్ల అందుకు అనుగుణంగా సన్నాహాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. వర్చువల్ మీట్ వివరాలు ట్విట్టర్ వేదిగ్గా కూడా వెల్లడించారు ప్రధాని.