దేశరాజధాని సర్వహంగులు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఇవాళ పరిశీలించారు. భవనంపై అశోకస్థంభాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలు ఎంపీలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వరాజ్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా నూతన భవనంలో ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని మోదీ సర్కారు సంకల్పించింది. అందుకోసమే శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాణపనుల్లో ఉన్న ఇంజినీర్లు, కార్మికులతో మోదీ మాట్లాడారు.
This morning, I had the honour of unveiling the National Emblem cast on the roof of the new Parliament. pic.twitter.com/T49dOLRRg1
— Narendra Modi (@narendramodi) July 11, 2022
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణంకోసం అంచనా వ్యయం రూ.971 కోట్లు.
నాలుగు అంతస్తుల పార్లమెంట్ భవనానికి కొత్త పార్లమెంట్ భవనానికి ఆరు ఎంట్రన్స్ లుంటాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి; 2. లోక్సభ సభాపతి, రాజ్యసభ చైర్పర్సన్, ఎంపీలు; 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్లు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. లోక్సభ ఛాంబర్లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు.రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు.భూకంపాలను సైతం తట్టుకునేలా ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేశీయ వాస్తు రీతుల్లో దీనిని నిర్మిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు దీనిలో చూడవచ్చు. సాంస్కృతిక వైవిద్ధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ఇక 93 ఏళ్లనాటి ప్రస్తుత భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షించనున్నారు.