కేదారినాథ్ లో 12 అడుగుల ఆదిశంకరుల విగ్రహం ఆవిష్కృతమవుతోంది. నవంబర్ 5న అంటే మరో రెండురోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చార్ ధామ్ దేవస్థానం బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. కేదార్ నాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మోదీ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో విధ్వంసం తర్వాత పునర్నిర్మించిన ఆదిశంకరాచార్య సమాధినీ ఆయన ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే సభలోనూ మోదీ ప్రసంగిస్తారు. అలాగే అక్కడి సరస్వతీ ఆస్తపథం పనులతీరును సమీక్షిస్తారు.
ఇక 130 కోట్లతో మందాకినీ నదిపై నిర్మిస్తున్న సరస్వతి రిటైనింగ్ వాల్, అస్తాపథ్, ఘాట్లు, మందాకినీ రిటైనింగ్ వాల్ ఆస్తపథ్, పురోహితుల గృహాలు, గరుడ చట్టీ బ్రిడ్జ్ నిర్మాణాలను ఆయన ప్రారంభించనున్నారు.
ఇంకా 180 కోట్లతో తలపెట్టిన సంగం ఘాట్, ఫస్ట్ ఎయిడ్ అండ్ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, హాస్పిటల్, గెస్ట్ హౌస్, పోలీస్ స్టేషన్ భవనం, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మందాకినీ అస్తాపథ్ క్యూ మేనేజ్ మెంట్ అండ్ రెయిన్ షెల్టర్ , సరస్వతీ సివిల్ అమెనిటీ బిల్డింగ్ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
చార్ ధామ్ యాత్రగా భక్తులు పిలిచే గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ , బద్రినాథ్ ను ఏటా కనీసం 30 లక్షలమంది సందర్శిస్తారు. హిందూ పవిత్ర తీర్థాల్లో మెరుగైన సౌకర్యాల కారణంగా 2019లో సందర్శకుల సంఖ్య 22.6 శాతం పెరిగినట్టు ఓ అంచనా.